Advertisement

వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచే పోటీ చేసి గెలుస్తా: కొండా సురేఖ

వరంగల్: తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న ఊహాగానాలను మాజీ మంత్రి కొండా సురేఖ పూర్తిగా తోసిపుచ్చారు. తాము కాంగ్రెస్‌లోనే పుట్టామని, చివరి వరకు కాంగ్రెస్‌లోనే ఉంటామని స్పష్టం చేశారు. 2026 సెప్టెంబర్ 13న వరంగల్ నగరంలోని ఎంకే నాయుడు హాల్‌లో నిర్వహించిన వరంగల్ తూర్పు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కొండా దంపతులు పాల్గొన్నారు.

కొండా సురేఖ మాట్లాడుతూ.. వరంగల్ తూర్పు టికెట్ తనదేనని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలిచి మంత్రి అవుతానని ధీమా వ్యక్తం చేశారు. పదవులు కేవలం అలంకారప్రాయమేనని, మంత్రి పదవి నుంచి తనను బర్తరఫ్ చేసినందుకు బాధ లేకపోయినా, ఎలాంటి కారణం లేకుండా తొలగించడమే తనను తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్ఠానం నుంచి తమకు ఫోన్లు వచ్చాయని, ఎటూ వెళ్లవద్దని ధైర్యం చెప్పారని తెలిపారు. రాహుల్ గాంధీ పాదయాత్ర స్పూర్తితో గెలుపొందానని, వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచే పోటీ చేసి గెలుస్తానని చెప్పారు. తనను బర్తరఫ్ చేయడం అధిష్ఠానానికి ఇష్టం లేదని, త్వరలోనే కొండా మురళీకి సముచిత పదవి ఇస్తామన్న సంకేతాలు వచ్చాయని తెలిపారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు మొదటగా మద్దతు తెలిపింది తానేనని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తనకు దక్కిన మూడు శాఖల్లోనూ ఎక్కడా అవినీతికి తావులేకుండా బాధ్యతలు నిర్వర్తించానని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement