Advertisement

తిరుపతి: భార్యాపిల్లలు దూరమై.. వ్యక్తి ఆత్మహత్య

AP CRIME: అప్పుల బాధతో భార్యాపిల్లలు ఆత్మహత్య చేసుకోవడం, ఆ వేదనను తట్టుకోలేక భర్త కూడా ప్రాణాలు తీసుకున్న విషాదకర ఘటన తిరుపతి జిల్లా పుత్తూరు మండల పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. తొరూరు పంచాయతీ పైడిపల్లికి చెందిన శివశంకరరావు (30), నేషనూరుకు చెందిన పద్మ ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి తేజ (7), లాస్య (5) అనే పిల్లలు ఉన్నారు. శివశంకరరావు కుటుంబ బాధ్యతలను పట్టించుకోకపోవడంతో, ఇంటి నిర్వహణ కోసం పద్మ చేసిన అప్పులు, డ్వాక్రా రుణాల ఒత్తిడి పెరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పద్మ, గతేడాది ఫిబ్రవరి 7న ఇద్దరు పిల్లలను ఉరివేసి చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శివశంకరరావుతో పాటు ఆయన తల్లిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన శివశంకరరావు.. భార్యాపిల్లలు లేరనే బాధతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ‘నా భార్య, పిల్లల్లేని జీవితం నాకొద్దు’ అని ఫోన్‌లో వాయిస్ రికార్డు చేసి బంధువులకు పంపి, పుత్తూరు అటవీశాఖ చెక్‌పోస్టు సమీపంలోని మామిడితోటలో ఉరేసుకున్నాడు. సీఐ నెట్టి కంఠయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement