Advertisement

మాజీమంత్రి జోగి రమేష్‌పై గవర్నర్‌కు కోడలి ఫిర్యాదు

హైదరాబాద్: YCP మాజీమంత్రి జోగి రమేష్, ఆయన కుటుంబసభ్యుల నుంచి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆయన కోడలు మేఘన గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కోరారు. బుధవారం రాజ్‌భవన్‌లో తన తండ్రి అనంతకృష్ణగౌడ్‌తో కలిసి ఆమె గవర్నర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.

తన పెళ్లికి తల్లిదండ్రులు రూ.5 కోట్లు ఖర్చు చేశారని, అయితే కొన్నాళ్లకే అత్త శకుంతల, మామ జోగి రమేష్, భర్త రాజీవ్ రూ.5 కోట్ల అదనపు కట్నంతో పాటు ఖరీదైన కార్లు, వజ్రాల నక్లెస్, వజ్రపు ఉంగరం తీసుకురావాలని వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. గోవా పర్యటనలో ఉన్నప్పుడు తనకు ఈత రాదని తెలిసినా భర్త పడవపై నుంచి నీటిలోకి నెట్టేసేందుకు యత్నించారని పేర్కొన్నారు. వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరగా, గవర్నర్ సానుకూలంగా స్పందించి ఈ కేసును తెలంగాణకు మార్పించుకోవాలని సూచించినట్లు తెలిపారు.

Advertisement
Advertisement