Advertisement

స్పీకర్‌కు అవమానం.. కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి: సీఎం రేవంత్‌

శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు అవమానం జరిగిన నేడు తెలంగాణ చరిత్రలోనే ఒక చీకటి రోజని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌పై జుగుప్సాకరమైన, అసభ్యకరమైన భాష ఉపయోగించారని తీవ్రంగా మండిపడ్డారు. ఇది అనాలోచితంగా జరిగిన చర్య కాదని, నిన్న కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ సభ్యులను పిలిపించుకుని పథకం ప్రకారం స్పీకర్‌పైకి ఉసిగొల్పారని ఆరోపించారు.

ఈ ఘటన కేవలం సభాపతికి మాత్రమే కాకుండా, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు, సభ్య సమాజానికి జరిగిన తీవ్ర అవమానమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మొదటి నుంచి దళితులను మోసం చేస్తూ వస్తోందని, దళితుడిని సీఎం చేస్తానని, మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి కేసీఆర్‌ మోసం చేశారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ది పూర్తిగా దళిత వ్యతిరేక ఆలోచన అని విమర్శించారు.

Advertisement

స్పీకర్‌కు జరిగిన అవమానాన్ని సభ మొత్తానికి జరిగిన అవమానంగా భావిస్తున్నామని, దీన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. స్వతంత్ర భారతంలో ఎప్పుడూ ఇలాంటి అవమానం జరగలేదన్నారు. అసభ్యకర భాష వాడిన తాతా మధు చేత రాజీనామా చేయించి వెంటనే డిస్మిస్‌ చేయాలని, ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ ఇందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. ఇలాంటి వాటిని క్షమిస్తే చట్టసభలకు భవిష్యత్తులో గౌరవం ఉండదని ఆయన స్పష్టం చేశారు

Advertisement