Advertisement

శంషాబాద్‌లో లారీని ఢీకొన్న కారు, యువకుడు మృతి

మన పత్రిక, శంషాబాద్: ముందు వెళ్తున్న లారీని కారు వెనుక నుంచి ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, శంషాబాద్ పట్టణంలోని ఆర్‌బీ నగర్‌కు చెందిన ఎస్. అజయ్ కుమార్ (31) వృత్తిరీత్యా డ్రైవర్. అతడు కొత్తూర్ మండలం గూడూరు గ్రామంలో జరిగిన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదానికి గురయ్యాడు.

బుధవారం తెల్లవారుజామున సుమారు 5:10 గంటల సమయంలో బీకే తండాకు చెందిన కేతావత్ ప్రసన్న కుమార్ అలియాస్ చరణ్ నడుపుతున్న స్విఫ్ట్ కారు, అతివేగంతో వెళ్లి ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు సీటులో కూర్చున్న అజయ్ కుమార్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న ప్రసన్న కుమార్ తీవ్రంగా గాయపడటంతో అతడిని తొండుపల్లిలోని లిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడి తల్లి ఎస్. పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement