మన పత్రిక, వాతావరణం: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. India Meteorological Department (ఐఎమ్డీ) హెచ్చరికల ప్రకారం నేడు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశమూ ఉంది.
తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 36°C నుంచి 38°C వరకు నమోదవుతున్నాయి. Hyderabadలో పాక్షిక మేఘావరణం ఉండి, సాయంత్రం లేదా రాత్రి సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. అలాగే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉండటంతో ఐఎమ్డీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఏపీలో మండే ఎండలు
ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కడప, కర్నూలు జిల్లాల్లో 41°C నుంచి 42°C వరకు చేరే అవకాశం ఉంది. తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.అలాగే విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో గాలిలో తేమ ఎక్కువగా ఉండటంతో ఉక్కపోత పెరుగుతుంది. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే సూచనలు ఉన్నాయి.
ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. వచ్చే రెండు వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగి, ఏప్రిల్ రెండో వారం తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
