మన పత్రిక: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ను తన ఖాతాలో వేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. త్వరలోనే ఈ విమానాశ్రయం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
2019 ఎన్నికలకు నెల రోజుల ముందు ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం శంకుస్థాపన రాయి వేయడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని జగన్ విమర్శించారు. 2020లో జీఎంఆర్ జీఎమ్ఆర్ (GMR) సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం నుంచి భూసేకరణ, భద్రతా అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన వరకు అన్ని పనులూ తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని స్పష్టం చేశారు.
ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూసేకరణను పూర్తి చేసి, నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతో పాటు నీరు, విద్యుత్, రహదారుల కనెక్టివిటీ కోసం తమ ప్రభుత్వం రూ.1200 కోట్లు ఖర్చు చేసిందని జగన్ తెలిపారు. కోవిడ్ సమయంలోనూ రన్వే, టెర్మినల్ పనులను వేగవంతం చేసి 2026 నాటికే విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని అప్పుడే ప్రకటించామని ఆయన పేర్కొన్నారు. తమ హయాంలో చేసిన కష్టానికి ఫలితాలు వస్తుంటే, చంద్రబాబు దొంగ క్రెడిట్ కొట్టేసేందుకు తాపత్రయపడుతున్నారని వ్యాఖ్యానించారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
