Advertisement

ఐఫోన్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్

మన పత్రిక, బిజినెస్: మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు కొత్త ఫీచర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఐఫోన్‌ యూజర్ల కోసం ఒకే ఫోన్‌లో రెండు వాట్సప్‌ ఖాతాలను వినియోగించే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటివరకు ఈ సదుపాయం కేవలం ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు మాత్రమే ఉండగా, ఇప్పుడు ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంపైనా విస్తరించనుంది. దీంతో వ్యక్తిగత, వృత్తిపర అవసరాల కోసం రెండు ఫోన్లు వాడాల్సిన అవసరం లేకుండా పోతుంది.

యాప్‌లో కింద భాగంలో కనిపించే ప్రొఫైల్‌ పిక్చర్‌ ద్వారా ప్రస్తుతం ఏ ఖాతా యాక్టివ్‌లో ఉందో సులభంగా గుర్తించవచ్చు. అలాగే ఫొటో ఎడిటింగ్‌, మెసేజ్‌ డ్రాఫ్టింగ్‌ కోసం కొత్త కృత్రిమ మేధ (ఏఐ) టూల్స్‌ను కూడా వాట్సప్‌ పరిచయం చేసింది. ‘మెటా ఏఐ’ సాయంతో ఫొటోలను మెరుగుపరచడం, అనవసర అంశాలను తొలగించడం, బ్యాక్‌గ్రౌండ్‌ మార్చడం వంటి ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక చాట్‌లలో సందర్భానుసారంగా సమాధానాలను సూచించే ‘ఏఐ రైటింగ్‌ హెల్ప్‌’ ఫీచర్‌ కూడా ఉపయోగపడనుంది. అయితే వినియోగదారుల గోప్యతకు ఎటువంటి భంగం కలగదని, చాట్‌లు పూర్తిగా ప్రైవేట్‌గా ఉంటాయని వాట్సప్‌ స్పష్టం చేసింది. ఈ ఫీచర్లు దశలవారీగా అందరికీ అందుబాటులోకి రానున్నాయి.

Advertisement
Advertisement