Advertisement

AP: ఘోర ప్రమాదం.. 10 మంది సజీవదహనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్కాపురం జిల్లాలో ఈ ఉదయం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని క్వారీల వద్ద చందూ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. అతివేగం, ప్రమాదకరమైన మూలమలుపే ఈ విపత్తుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్‌ డీజిల్ ట్యాంకర్ పేలడంతో మంటలు క్షణాల్లోనే బస్సును చుట్టేసి, రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఈ ఘోర ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు బయటకు రాలేక లోపలే సజీవదహనమయ్యారు. మృతులంతా కనిగిరి, పామూరు ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉండగా, మంటలు వ్యాపించకముందే ముందు సీట్లలో ఉన్న 22 మంది చాకచక్యంగా కిందకు దూకేసి ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే, గాఢనిద్రలో ఉన్న వెనుక సీట్ల ప్రయాణికులు తేరుకునేలోపే మంటలు బస్సును ఆవరించడంతో పెను విషాదం నెలకొంది. ఈ బస్సు తెలంగాణలోని నిర్మల్ నుంచి ఉదయగిరి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement