Advertisement

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘నందూస్ వరల్డ్’ నందన అరెస్ట్

లండన్‌లో విలాసవంతమైన జీవితాన్ని చూపి యూట్యూబ్‌లో ఫాలోవర్లను సంపాదించుకున్న ‘నందూస్ వరల్డ్’ దంపతులు భారీ వీసా స్కామ్‌లో చిక్కుకున్నారు. విజయవాడ, హైదరాబాద్, లండన్‌లలో ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ పేరిట ఆఫీసులు ఏర్పాటు చేసి, నిరుద్యోగులను మోసం చేశారు. యూకేలో వర్క్ వీసాలు, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ ఇప్పిస్తామంటూ ఒక్కో బాధితుడి నుంచి రూ.15 నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేశారు.

సుమారు 8కి పైగా షెల్ కంపెనీలను సృష్టించి నకిలీ ఆఫర్ లెటర్లు పంపారు. బాధితులు ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన శివ క్రాంతి కుమార్ ఫిర్యాదుతో అసలు గుట్టు రట్టయింది. మధుకర్ (A1), రమా నందన (A2), మోహన్ రావు (A3)లపై కేసులు నమోదయ్యాయి. విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో లండన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రమా నందనను ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ఈ కుంభకోణం విలువ రూ. 10 నుంచి 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

Advertisement
Advertisement