Advertisement

మహబూబాబాద్‌లో రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడిని కాపాడిన పోలీసులు

మన పత్రిక, మహబూబాబాద్: మహబూబాబాద్ రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ యువకుడిని పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో డీజీ కంట్రోల్ రూమ్ నుంచి అందిన సమాచారంతో రూరల్ సీఐ అంజలి, ఎస్సై సుదర్శన్ మరియు బ్లూ కోల్ట్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఇల్లందుకు చెందిన షేక్ వసీమ్(26) అనే యువకుడు రైల్వే పట్టాలపై పడుకుని ఉండగా, అదే సమయంలో మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైలు అక్కడికి చేరుకుంటోంది. పోలీసులు వెంటనే స్పందించి అతడిని పట్టాలపై నుంచి సురక్షితంగా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. అనంతరం అతడిని మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి యువకుడి ప్రాణాలను కాపాడిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అభినందించారు.

Advertisement
Advertisement