Advertisement

ఏపీలో తల్లికి వందనం నిధులు విడుదల, తల్లుల ఖాతాల్లో రూ.13,000 జమ

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తల్లికి వందనం’ (Talliki Vandanam) పథకం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ నిధులను జమ చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 42.70 లక్షల మంది తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ.10,120.78 కోట్లను ప్రభుత్వం జమ చేస్తోంది. అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13,000 చొప్పున చేరుతుండగా, ఈ ఆర్థిక సహాయ ప్రక్రియ ఈ నెల 24 వరకు కొనసాగుతుంది.

పథకం వివరాలు

గతంలో ఉన్న నిబంధనలకు భిన్నంగా, ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా ఈ పథకం ప్రయోజనాలను అందిస్తున్నామని మంత్రి లోకేష్ వివరించారు. ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న దాదాపు 67.47 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. పిల్లలే మన సంపద అని, వారి చదువులే తరగని ఆస్తి అని పేర్కొన్న మంత్రి నారా లోకేష్, పిల్లలను చదివిస్తున్న ప్రతి తల్లికీ తన వందనాలు తెలియజేశారు.

Advertisement
Advertisement