ఒకప్పుడు కేసీఆర్ గంభీరంగా ప్రకటించారు – “ఇకపై రాష్ట్రంలో కంట్రాక్టు లేదా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉండరు.” కానీ, ఈ ప్రకటన ఎంత డొల్ల యవ్వారమో ఇప్పుడు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన IFMIS (Integrated Finance Management & Information System) ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి వివరాలను క్రోడీకరించారు.
IFMIS ద్వారా సేకరించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో దాదాపు 4,93,820 మంది కంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. కానీ, ఇప్పటి వరకు కేవలం 2,74,844 మంది వివరాలే దొరికాయి. మిగిలిన 2.18 లక్షల మంది ఎవరు? వీరిలో కనీసం లక్ష మంది బోగస్ ఉద్యోగులు అని ప్రభుత్వ వర్గాలు రూఢి చేసుకుంటున్నాయి. వీరికి పదేళ్లుగా దాదాపు 18 వేల కోట్ల ప్రజాధనం అన్యాయంగా చెల్లించబడింది.
ఈ బోగస్ ఉద్యోగులు ఎవరు? ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్-1 అధికారుల వద్ద, హెచ్ఓడీలు, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కూడా పేర్లు రాసేసుకుని, కంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పేరిట జీతాలు మాత్రం చెల్లించేస్తున్నారట. కొందరు ఉన్నతాధికారుల బంధువులు కూడా.
ఒక ఉదాహరణ చూద్దాం. జీహెచ్ఎంసీలో 21 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్టు లెక్క. కానీ, ఫేస్ రికగ్నిషన్ సిస్టం తెచ్చాక 15 వేల మంది మాత్రమే లెక్క తేలింది. అంటే, 6 వేల మంది బోగస్. అలాగే, జీఏడీలో 1600 మంది తాత్కాలిక ఉద్యోగులున్నట్టు లెక్క చూపిస్తుండగా, నిజంగా పనిచేస్తున్నది 764 మంది మాత్రమే.
చివరగా, కొండా సురేఖ పేషీలో ఓ అరాచక శక్తిగా ఎదిగిన ఓఎస్డీ సుమంత్, నిజానికి కాలుష్య నివారణ బోర్డులో ఓ టెంపరరీ ఉద్యోగి. తనను పేషీలోకి ఓఎస్డీగా తీసుకొచ్చారు. ఇక తను సాగించిన అరాచకం తీవ్రత ఏమిటో మొన్నటి నుంచీ చూస్తున్నాం, వింటున్నాం, చదువుతున్నాం కదా. ఎన్ని విభాగాల్లో ఎందరు సుమంత్లో..!!
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
