మన పత్రిక, సిక్కిం: నామ్చి జిల్లాలో నిర్మిస్తున్న ఎన్హెచ్పీసీ తీస్తా స్టేజ్-6 జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో జరిగిన భారీ పేలుడులో ఎనిమిది మంది కార్మికులు మరణించారు. సొరంగం లోపల సహజంగా పేరుకుపోయిన మీథేన్ గ్యాస్ను బయటకు పంపే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ పేలుడు ధాటికి కొండచరియలు, రాళ్లు విరిగిపడటంతో సొరంగం ప్రవేశ మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ప్రమాద సమయంలో అక్కడ పనిచేస్తున్న వారిలో కొందరు బయటపడగా, 18 మందికి పైగా కార్మికులు లోపలే చిక్కుకుపోయారు.
సహాయక చర్యల్లో సవాళ్లు
సమర్డుంగ్ ప్రాంతంలో పటేల్ ఇంజినీరింగ్ సంస్థ నిర్వహిస్తున్న ఈ పనుల వద్ద సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే టన్నెల్ లోపల మీథేన్ వాయువు దట్టంగా అలుముకోవడంతో పాటు ఆక్సిజన్ కొరత, వెలుతురు లేకపోవడం వల్ల రెస్క్యూ సిబ్బందికి ఇబ్బందులు ఎదురయ్యాయి. గ్యాస్ ప్రొటెక్షన్ గేర్లు ధరించిన ప్రత్యేక బృందాలను పశ్చిమ బెంగాల్ నుంచి రప్పించి, చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
