Advertisement

ఏపీలో వర్షాలు.. 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల మూడు గంటల్లో తొమ్మిది జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖపట్నం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం తదితర జిల్లాలకు ఈ హెచ్చరికలు వర్తిస్తాయని తెలిపింది. ఆయా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా పొడి వాతావరణం నెలకొనడంతో మధ్యాహ్నం ఎండలు భగ్గుమంటున్నాయి. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తాజా ప్రకటనతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది. వర్షాల కారణంగా ఉక్కపోత తగ్గి వాతావరణం చల్లబడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Advertisement