మన పత్రిక, మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని తక్కెళ్లపాడు గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. వరి కోత పనులకు వెళ్లిన శంకరమ్మ (35) అనే మహిళ విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయింది.
రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో వరి కోత పనులు జరుగుతుండగా, కోత మిషన్కు మోటార్ సర్వీస్ వైర్ తగిలే అవకాశం ఉండటంతో శంకరమ్మ దానిని కర్రతో పైకి లేపే ప్రయత్నం చేసింది. అయితే ఆ కర్ర జారిపోయి సర్వీస్ వైర్ నేరుగా ఆమె చేతికి తగలడంతో తీవ్రమైన విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి భర్త మాల్సూర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
