మన పత్రిక, ఠాణె: మహారాష్ట్రలోని ఠాణెలో చీరల విషయంలో జరిగిన గొడవలో ఒక భార్య తన భర్తను హతమార్చిన ఘటన చోటుచేసుకుంది. హరేరామ్ సింగ్ (35) మరియు సునీతాదేవి (30) దంపతులు ఠాణెలో నివసిస్తున్నారు. వీరిద్దరికీ కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. శనివారం నాడు సునీతాదేవి తన భర్తను చీరలు కొనివ్వమని అడగగా, ఆయన నిరాకరించడంతో వారి మధ్య వాదన మొదలైంది. ఈ గొడవ తీవ్రరూపం దాల్చడంతో సునీతాదేవి కోపంతో భర్తపై దాడికి పాల్పడింది.
సునీతాదేవి కుక్కర్ మూతతో తన భర్తను బలంగా కొట్టి, అనంతరం గొంతు నులిమి హత్య చేసింది. మొదట భర్త ప్రమాదవశాత్తు మరణించాడని నమ్మించేందుకు ప్రయత్నించినప్పటికీ, పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించడంతో అసలు విషయం బయటపడింది. విచారణలో తన భర్తను చీరల విషయంలో జరిగిన గొడవ కారణంగా తానే చంపేశానని సునీతాదేవి అంగీకరించింది. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ వివరాలను బుధవారం వెల్లడించారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
