Advertisement

ఆదిలాబాద్ సీసీఐ ప్లాంట్ పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ

మన పత్రిక: ఉత్తర తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి, స్థానిక యువతకు ఉపాధి కల్పించే ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్లాంట్‌ను పునరుద్ధరించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని బీఆర్ఎస్ నాయకుడు KTR మండిపడ్డారు. ఈ ప్లాంట్‌ను మళ్లీ తెరిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుధవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ పరిశ్రమపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కేంద్రం సిద్ధంగా ఉన్నా రాష్ట్రం వల్లే ఆలస్యం

జులై 15న సీసీఐ సాధన సమితి, బీఆర్ఎస్ బృందంతో కలిసి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలిసిన విషయాన్ని కేటీఆర్ లేఖలో గుర్తుచేశారు. ఆదిలాబాద్ యూనిట్‌ను పునఃప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలు కేటాయించి, అవసరమైన మౌలిక వసతులు మరియు ప్రోత్సాహకాలు అందించాల్సి ఉందని కుమారస్వామి తెలిపారని ఆయన వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి సరైన ప్రతిపాదన రాకపోవడం వల్లే ఈ ప్రక్రియ నిలిచిపోయిందని కేటీఆర్ స్పష్టం చేశారు.

Advertisement

హామీలకే పరిమితమైన పాలన

ఎన్నికల సమయంలో ఆదిలాబాద్‌ను సందర్శించి సీసీఐని తెరిపిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను విస్మరించారని కేటీఆర్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఆధ్వర్యంలో కేంద్రానికి ఎన్నో లేఖలు రాశామని, టీఎస్-ఐపాస్ కింద సబ్సిడీలతో పాటు భాగస్వామ్య ప్రాతిపదికన లేదా పూర్తిగా రాష్ట్రమే ప్లాంట్‌ను నడిపేందుకు సిద్ధమని ఆనాడే ప్రతిపాదించామని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీసీఐ పునరుద్ధరణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని ఆయన కోరారు.

Advertisement