Advertisement

మెగాస్టార్ చిరంజీవి కుమార్తెకు కీలక పదవి

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కుమార్తె, ఫ్యాషన్ డిజైనర్, నిర్మాత కొణిదెల సుస్మితకు అరుదైన గౌరవం దక్కింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఆమెను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ బాధ్యత ద్వారా సుస్మిత ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆలయ సమగ్ర అభివృద్ధి, దసరా నవరాత్రుల నిర్వహణలో తన వంతు సూచనలు అందించనున్నారు. మెగా కుటుంబం నుంచి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా, నాగబాబు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా సేవలందిస్తుండగా.. తాజాగా సుస్మితకు కూడా ఈ అవకాశం దక్కింది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి పాలకమండలి సభ్యురాలిగా చిరంజీవి సతీమణి సురేఖను నియమించిన విషయం తెలిసిందే. దీనితో తెలుగు రాష్ట్రాల ఆధ్యాత్మిక రంగంలోనూ మెగా కుటుంబం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement
Advertisement