Advertisement

కాచిగూడలో లాడ్జింగ్‌లపై పెరుగుతున్న ఆరోపణలు

మన పత్రిక, హిమాయత్ నగర్: హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉన్న హోటళ్లు, లాడ్జింగ్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ వివిధ ప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్‌కు వచ్చే వారు ఇక్కడి హోటళ్లను ఆశ్రయిస్తూ, అసాంఘిక పనులకు పాల్పడుతున్నారని సమాచారం.

నిబంధనలు పాటించని హోటల్ యజమానులు

అంబర్‌పేట నియోజకవర్గంలోని కాచిగూడ డివిజన్‌లో సుమారు 30 హోటళ్లు ఉన్నాయి. ఇందులో కాచిగూడ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఒక ప్రముఖ హోటల్‌కు జంటలు ఎక్కువగా చేరుకుంటున్నారని, హోటల్ యజమానులు వచ్చే వారి వివరాలను సరిగ్గా సేకరించకుండానే గదులను కేటాయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల రాత్రి వేళల్లో హోటళ్లలో ఉండాలంటే ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. సాధారణ ప్రజలు కూడా కుటుంబ సభ్యులతో కలిసి భోజనానికి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Advertisement

ప్రత్యేక నిఘా అవసరం

కాచిగూడ డివిజన్‌లోని హోటళ్లపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసులు నిఘా పెంచి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Advertisement