Advertisement

ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత

TELANGANA POLITICS: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్ద డప్పుల మోత మోగించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో నర్సారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బారికేడ్లను తోసుకుంటూ ఫామ్‌హౌస్‌కు అర కిలోమీటరు దూరానికి చేరుకుని నిరసన తెలిపారు. డీసీసీ అధ్యక్షురాలు బారికేడ్లు తోసుకుని ముందుకు వెళ్లడంతో పోలీసులకు, ఆందోళనకారులకు తోపులాట జరిగి, కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు మర్కుక్‌ వద్ద బీఆర్‌ఎస్‌ శ్రేణులు రైతు దీక్ష చేపట్టాయి.

ఈ పరిణామాలపై అసెంబ్లీ నుంచి ఎర్రవల్లికి బయల్దేరిన బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావులను బొల్లారం, హకీంపేట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ శ్రేణులను అనుమతించి, తమ నాయకుడిని కాపాడుకునేందుకు వెళ్తున్న తమను ఎందుకు ఆపుతున్నారంటూ కేటీఆర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బొల్లారం చౌరస్తా నుంచి పాదయాత్రగా బయల్దేరిన కేటీఆర్, హరీశ్‌రావులతో పాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్‌ చేసి జవహర్‌నగర్, బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

Advertisement
Advertisement