Advertisement

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మొదలైన వానలు రాబోయే మూడు రోజులు భారీ వర్షాల సూచన

మన పత్రిక: బంగాళాఖాతంలో ఏర్పడనున్న కొత్త అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో Heavy rains మళ్లీ జోరందుకోనున్నాయి. ఈ నెల 23, 24 తేదీల్లో ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలను ఆనుకుని మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి కొనసాగుతోంది. ఈ పరిస్థితుల వల్ల రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉంది.

భారీ వర్షాల హెచ్చరిక

మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి మరియు మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వానలు నమోదవుతాయని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

ప్రజలకు వాతావరణ శాఖ సూచనలు

గడిచిన 24 గంటల్లో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలో 10.1 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా కట్టంగూరులో 8.2 సెంటీమీటర్లు, నిజామాబాద్ రూరల్ పరిధిలోని మల్కాపూర్‌లో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద ఉండకూడదని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని ఐఎమ్‌డీ సూచించింది. రాబోయే రోజుల్లో వర్షాల ప్రభావం ఉండనున్నందున రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండి స్థానిక యంత్రాంగం హెచ్చరికలను పాటించాలని కోరారు.

Advertisement