Advertisement

గురుగ్రామ్‌లో దారుణం: ప్రేయసిని చంపి ఏఐ ఇంజనీర్ ఆత్మహత్య

మన పత్రిక, గురుగ్రామ్: గురుగ్రామ్‌లో ఒక ఏఐ ఇంజనీర్ (AI Engineer) తన ప్రేయసిని కత్తితో పొడిచి హత్య చేసి, అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శ్రేష్ఠ్ మాలిక్ (25), ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇషారా అయూబీగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ఒకే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. శనివారం అయూబీ కుటుంబ సభ్యులు సెక్టార్-56 పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసులు అయూబీ ఫోన్ లొకేషన్ ఆధారంగా సెక్టార్ 55లోని మాలిక్ ఉంటున్న పీజీ (PG) వసతి గృహాన్ని పరిశీలించగా, అక్కడ ఆమె మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది. అదే సమయంలో గర్హి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి మరణించిన వ్యక్తి మాలిక్ అని ధృవీకరించారు. నిందితుడు మాలిక్, అయూబీని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Advertisement
Advertisement