Advertisement

ఐఫోన్‌కు బదులు గడ్డం నూనె పంపిన ఘటనలో ఫ్లిప్‌కార్ట్‌కు వినియోగదారుల కమిషన్ జరిమానా

మన పత్రిక, ముంబై: ఈ-కామర్స్ దిగ్గజం Flipkart ద్వారా ఐఫోన్ ఆర్డర్ చేసిన వినియోగదారుడికి గడ్డం పెంచే నూనె సీసా పంపిన వ్యవహారంలో ముంబైలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీవ్రంగా స్పందించింది. బాధితుడికి రూ.1.11 లక్షలకు పైగా నగదును తిరిగి చెల్లించడంతో పాటు నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కింద రూ.70,000 చెల్లించాలని ఫ్లిప్‌కార్ట్ మరియు సదరు విక్రేతను ఆదేశించింది.

ముంబైలోని పొవాయ్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి 2023 ఏప్రిల్ 22న ఫ్లిప్‌కార్ట్ ద్వారా నో-కాస్ట్ EMI పద్ధతిలో రూ.1,11,793 విలువైన అల్లా ప్రొడక్ట్ Apple iPhone 14 Pro (128 GB) ఫోన్‌ను ఆర్డర్ చేశారు. అయితే మరుసటి రోజు వచ్చిన పార్సిల్‌లో ఐఫోన్‌కు బదులుగా గడ్డం పెంచే నూనె సీసా ఉంది. దీనిపై బాధితుడు ఏప్రిల్, మే 2023 మధ్య ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌ను పలుమార్లు సంప్రదించి ఆధారాలు అందించినప్పటికీ, ఎలాంటి పరిష్కారం చూపకుండానే ఫిర్యాదును ముగించారు.

Advertisement

ఈ కేసును విచారించిన అదనపు డిసిఎఫ్ వినియోగదారుల కమిషన్, కస్టమర్ ఫిర్యాదులను సరిగ్గా పరిష్కరించకపోవడం అనుచిత వ్యాపార విధానం కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ వేదికగా అమ్మకాలు జరిపినప్పుడు సరైన వస్తువు డెలివరీ అయ్యేలా చూడాల్సిన బాధ్యత ఫ్లిప్‌కార్ట్‌పై ఉంటుందని తెలిపింది. సెల్లర్ ఇంటర్నేషనల్ వ్యాల్యూ రీటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా సరైన ప్రొడక్ట్ పంపడంలో విఫలమైందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో బాధితుడికి రూ.1,11,793 సొమ్మును 2023 ఏప్రిల్ 22 నుండి 9 శాతం వడ్డీతో కలిపి 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. దీనికి అదనంగా మానసిక ఆందోళనకు గురిచేసినందుకు రూ.50,000 పరిహారం, వ్యాజ్యాల ఖర్చుల కింద రూ.20,000 చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆపిల్ ఇండియా పాత్ర ఏమీ లేదని, కేవలం డెలివరీ లోపం మాత్రమే జరిగినందున ఆపిల్ సంస్థపై ఉన్న ఫిర్యాదును కమిషన్ కొట్టివేసింది.

Advertisement