Advertisement

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్టు

TELANGANA POLITICS: సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కులం పేరుతో దూషించారన్న ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధును మంగళవారం ఉదయం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిని కోకాపేటలోని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. స్పీకర్‌ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసి, వీరిద్దరిని నారాయణగూడ పీఎస్‌కు తరలించారు.

నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులకు, బీఆర్‌ఎస్‌ ప్రతినిధులకు మధ్య జరిగిన తోపులాట సందర్భంగా స్పీకర్‌పై తాతా మధు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. సీఎం, వివిధ పార్టీల నేతలు ఈ వ్యాఖ్యలను ఖండించగా.. చర్చలో స్పీకర్‌ కంటతడి పెట్టారు. ఎమ్మెల్సీల అరెస్టులపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తే తామందరం స్వచ్ఛందంగా అరెస్టవుతామని సవాల్‌ విసిరారు. హైకోర్టు స్పష్టంగా చెప్పినా ఫేక్‌ కేసులు పెట్టి అరెస్టు చేశారంటూ ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు.

Advertisement
Advertisement