మన పత్రిక: రక్షాబంధన్ సందర్భంగా శుక్రవారం, ఆగస్టు 28న దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవు ప్రకటించింది. రాఖీ పండగతో పాటు వివిధ ప్రాంతీయ వేడుకల కారణంగా ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకులు సాధారణ సమయాల్లో యథావిధిగా పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు.
గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, జమ్మూ, ఉత్తరప్రదేశ్, కేరళ, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్ ప్రాంతాల్లో ఆగస్టు 28న బ్యాంకులు మూతపడనున్నాయి. రాఖీ పండగతో పాటు సిక్కింలో ‘పాంగ్-లహాబ్సోల్’ పండుగ, కేరళలో శ్రీ నారాయణ గురు జయంతి, అయ్యంకాలి జయంతి సందర్భంగా సెలవు అమల్లో ఉంటుంది. నేరుగా బ్రాంచీకి వెళ్లాల్సిన పనులున్న ఖాతాదారులు తదుపరి పనిదినం వరకు వేచి చూడాల్సి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాలు, దిల్లీలో బ్యాంకులు పనిచేస్తాయి
తెలంగాణతో పాటు దిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బిహార్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆగస్టు 28న బ్యాంకులకు సెలవు లేదు. ఈ ప్రాంతాల్లోని బ్యాంకులు తమ సాధారణ పనివేళల్లో సేవలందిస్తాయి. బ్రాంచీలు మూతపడిన ప్రాంతాల్లో కూడా యుపిఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి. అయితే నగదు డిపాజిట్లు, చెక్కుల క్లియరెన్స్, డ్రాఫ్ట్ల జారీ వంటి ప్రత్యక్ష సేవలకు బ్రాంచ్ తెరిచేవరకు ఆగాల్సి ఉంటుంది.
ఆగస్టు 29వ తేదీ నెలలో ఐదో శనివారం కావడంతో ఆ రోజు దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేస్తాయని ఆర్బీఐ నిబంధనలు పేర్కొంటున్నాయి. సాధారణంగా రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది. అనంతరం ఆగస్టు 30 ఆదివారం కావడంతో యథావిధిగా వారంతపు సెలవు అమలవుతుంది.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
