Advertisement

కరీంనగర్‌లో దారుణం.. పిల్లలను బావిలో పడేపిన తండ్రి

మన పత్రిక, క్రైం: కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి అమానుషానికి పాల్పడి తన కవల కూతుళ్ల ప్రాణాలను బలి తీసుకున్నాడు. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం జూబ్లీ నగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గచ్చు శ్రీశైలం అనే వ్యక్తి శుక్రవారం ఉదయం తన భార్యతో గొడవ పడ్డాడు. ఆగ్రహానికి లోనైన అతడు కన్నప్రేమను మరచి సుమారు ఐదేళ్ల వయస్సున్న తన కవల కూతుళ్లపై ప్రతీకారం తీర్చుకున్నాడు. ముందుగా చిన్నారులకు బలవంతంగా గడ్డి మందు తాగించాడు. అనంతరం వారిని సమీపంలోని బావిలోకి తోసివేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక చిన్నారి మృతదేహం బావిలో లభ్యమైంది. మరో చిన్నారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇక ఈ దారుణ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు నిందితుడు శ్రీశైలంను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలే ఈ విషాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Advertisement