Advertisement

నిర్మల్: పురుగు మందు తాగి సర్పంచ్ సూసైడ్

మన మత్రిక, TG క్రైం: నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కడెం మండలం మాసాయిపేట గ్రామ సర్పంచ్ లహరి దురదృష్టకర పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల ప్రకారం లహరి పురుగు మందు తాగి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కారులో సమీప ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి వేగంగా తీసుకెళ్తున్న సమయంలో మార్గమధ్యలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాక్టర్ నాగళ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటికే అస్వస్థతతో ఉన్న లహరి పరిస్థితి మరింత విషమించింది. వెంటనే మరో వాహనంలో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజు అటు ప్రాణాలు తీసుకునే ప్రయత్నం, ఇటు రోడ్డు ప్రమాదం వంటి రెండు విషాదకర ఘటనలు చోటుచేసుకోవడంతో మాసాయిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లహరి మృతి పట్ల గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement