Advertisement

పల్నాడు: దాహమని నీళ్లు అడిగి.. మహిళా ప్రభుత్వ ఉద్యోగిపై అత్యాచారం

మన పత్రిక, AP క్రైం: పల్నాడు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. దాహమని నీళ్లు అడిగిన వ్యక్తికి సహాయం చేయబోయిన ఓ మహిళపై అత్యాచారం జరగడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మాచర్లలో చోటుచేసుకుంది. సత్తెనపల్లికి చెందిన బాధితురాలు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ మాచర్లలో ఒంటరిగా నివసిస్తోంది. గుడ్ ఫ్రైడే సందర్భంగా స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో, సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తి ఇంటి తలుపు తట్టి తాగడానికి నీళ్లు అడిగాడు. ఆమె లోపలికి వెళ్లి నీళ్లు తీసుకొస్తుండగా, ఆ వ్యక్తి బలవంతంగా లోనికి చొరబడి కత్తితో బెదిరించి దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలి చేతులు, కాళ్లు కట్టేసి అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఆమె స్పృహ కోల్పోయింది. తర్వాత ఆమె దత్తత కుమారుడు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి స్నేహితులను ఇంటికి పంపాడు. వారు వెళ్లి చూసేసరికి బాధితురాలు అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను తక్షణమే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నరసరావుపేట ఆసుపత్రిలో అత్యవసర చికిత్స కొనసాగుతోంది.

ఈ ఘటనపై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్రంగా స్పందించారు. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు వేగవంతం చేశారు.దాహం తీర్చాలని వచ్చిన వ్యక్తి ఇలాంటి దారుణానికి పాల్పడటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల భద్రతపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement