మన పత్రిక, క్రైం: విశాఖ గాజువాకలో సోమవారం మహిళ హత్య ఘటన కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సౌత్ ఏసీపీ వై. శ్రీనివాసరావు, సీఐ అళహరి పార్థసారథి వెల్లడించారు. పాతగాజువాక ఎల్వీ నగర్లో నివసిస్తున్న ఇండియన్ నేవీ ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్ చింతాడ రవీంద్ర (30) 2021లో డేటింగ్ యాప్ ద్వారా తాటిచెట్లపాలెం సంజీవయ్యకాలనీకి చెందిన పి. మౌనిక (31)తో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం 2024లో మరో మహిళను వివాహం చేసుకున్నప్పటికీ మౌనికతో సంబంధం కొనసాగించాడు.
ఇటీవల భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో మౌనికను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించి తన ఫ్లాట్కు పిలిచాడు. అక్కడ ఇద్దరి మధ్య తలెత్తిన గొడవలో కోపంతో ఆమెను తోసివేసి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ఆన్లైన్లో కత్తి, శుభ్రపరిచే ద్రవాలు, సంచులు తెప్పించుకుని శరీరాన్ని ముక్కలుగా నరికి కొన్ని భాగాలను ఫ్రిజ్లో, మరికొన్నింటిని మంచం కింద దాచాడు. కొన్ని అవశేషాలను నగరంలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి తగలబెట్టినట్లు పోలీసులు తెలిపారు.
తరువాత ఈ విషయం మిత్రుడికి చెప్పగా అతని సూచనతో నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. డబ్బుల కోసం మౌనిక వేధించిందని రవీంద్ర చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను మౌనిక తండ్రి వేణుగోపాల్ ఖండించారు. తన కుమార్తెపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించగా, పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
