Advertisement

ఉత్తరప్రదేశ్‌: విడాకులు వచ్చిన సంతోషంలో సాష్టాంగ యాత్ర

మన పత్రిక, వైరల్: ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడు చేసిన వినూత్న మొక్కు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా దాంపత్య బంధం సుఖంగా కొనసాగాలని దేవుడిని ప్రార్థిస్తారు. కానీ బస్తీ జిల్లాకు చెందిన యోగేష్ మాత్రం తన వివాహ బంధం ముగియాలని కోరుకున్నాడు. భార్యతో వచ్చిన విభేదాల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన అతడు, విడాకులు మంజూరైతే ఆలయానికి ‘దండవత్ యాత్ర’ చేస్తానని మొక్కుకున్నాడు.

2022లో వివాహం అయిన కొద్ది కాలానికే దాంపత్య జీవితం కలతలు చెంది, సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో విముక్తి కోసం యోగేష్ దేవుడిని ఆశ్రయించాడు. ఈ ఏడాది జనవరిలో కుటుంబ న్యాయస్థానం విడాకులు మంజూరు చేయడంతో తన మొక్కు తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. నవరాత్రుల సమయంలో ఉపవాస దీక్షతో యోగేష్ 9 కిలోమీటర్ల మేర దండవత్ యాత్ర ప్రారంభించాడు. నేలపై సాష్టాంగ నమస్కారం చేస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ప్రయాణించాడు. ‘జై శ్రీరామ్’, ‘జై బజరంగబలి’ నినాదాలతో సుమారు 12 గంటల పాటు కఠిన యాత్ర కొనసాగించాడు. రాళ్లు, రప్పలు ఉన్న మార్గంలో ప్రయాణించడంతో మోకాళ్లు గాయపడ్డా వెనుకడుగు వేయలేదు.

Advertisement

చివరకు సోమవారం సాయంత్రం ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకున్నాడు. పోలీసులు బందోబస్తు కల్పించగా, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అతనికి మద్దతుగా నిలిచారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement