Advertisement

పీర్జాపూర్‌లో ఉద్రిక్తత.. పూజలు లేకుండానే గణేశుడి నిమజ్జనం

రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగుడ మండలం పీర్జాపూర్ గ్రామంలో వినాయక ప్రతిష్ట వివాదం సంచలనం సృష్టించింది. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో గణేశుడి విగ్రహం ఏర్పాటు చేసే విషయంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. అదే ఆలయంలో తాము తయారు చేసిన గణనాథుడిని ప్రతిష్ఠిస్తామని ఒక వర్గం పట్టుబట్టడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఆలయంలో ఎలాంటి విగ్రహాన్ని పెట్టొద్దని, ప్రత్యామ్నాయంగా వేరే చోట ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీసుల జోక్యంతో మనస్తాపానికి గురైన సదరు వర్గం సభ్యులు, తీవ్ర ఆవేదనతో ఏమాత్రం పూజలు నిర్వహించకుండానే విగ్రహాన్ని నేరుగా సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.

Advertisement
Advertisement