Advertisement

పంచముఖ సంకటహర మహా గణపతిగా ఖైరతాబాద్ బడా గణేష్

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రత్యేక ఖ్యాతి గడించిన ఖైరతాబాద్ బడా గణేష్ ఈ ఏడాది 72వ ఉత్సవాలతో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రెండ్రోజుల క్రితమే విగ్రహ ఏర్పాటు పూర్తికాగా, ఉత్సవ కమిటీ గణేషుడి ఆగమనాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈసారి ఏకంగా 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహా గణపతి కొలువుదీరాడు. వినాయకచవితి పూజలందుకునేందుకు బొజ్జ గణపయ్య పూర్తిగా సిద్ధమయ్యాడు.

సోమవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా తొలి పూజ ఘనంగా జరగనుంది. ఆ తర్వాతి నుంచే సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా, అధికారిక పూజలకు ముందే ఆదివారం నాడే భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. 69 అడుగుల ఎత్తులో ప్రశాంత, సుందర, ముగ్ధమనోహర రూపంలో కొలువుదీరిన ఆ విఘ్నాధిపతిని చూసేందుకు భక్తులు తన్మయత్వానికి లోనవుతున్నారు.

Advertisement
Advertisement