Advertisement

కంటతడి పెట్టిన ‘అగ్ని పరీక్ష సీజన్ 2’ రాజకుమారి

బిగ్‌బాస్ ‘అగ్ని పరీక్ష సీజన్ 2’ ద్వారా ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ రాజకుమారి దయాన మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె ఆటతీరుతో కాదు.. తనపై వస్తున్న ట్రోలింగ్‌పై కన్నీళ్లతో స్పందించి అందరినీ భావోద్వేగానికి గురిచేశారు. ‘అగ్ని పరీక్ష’లో కామన్ మ్యాన్ కేటగిరీలో పోటీ చేసిన రాజకుమారి.. తన కాన్ఫిడెన్స్, మాటతీరు, తెగువతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఫిజికల్ టాస్కుల్లో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోరాడిన విధానం జడ్జీలతో పాటు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దీంతో ఆమెకు ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10’ మెయిన్ హౌస్‌లో ఛాన్స్ దక్కడం ఖాయమని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆమెకు ఆ అవకాశం దక్కకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు.

ఇదిలాఉంటే, హౌస్ నుంచి బయటకు వచ్చాక ఆమెకు ఊహించని రీతిలో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదురవుతోంది. బిగ్‌బాస్‌లో అవకాశం కోసమే ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని, కష్టాలను బయటపెట్టిందని, ఆమె ఒక ‘సింపతీ స్టార్’ అంటూ కొందరు నెటిజన్లు దారుణమైన కామెంట్లు చేశారు. ఈ విమర్శలపై తీవ్ర భావోద్వేగానికి గురైన రాజకుమారి.. తన పిల్లలతో ఉన్న ఒక కన్నీటి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఆవేదన వెళ్లగక్కారు.

Advertisement

“నేను ఏం తప్పు చేశాను? నాకే అర్థం కావట్లేదు. ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు. కానీ నా గురించి మాట్లాడిన మాటలు, నిందలు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. హైదరాబాద్‌ నుంచి ఇంటికి వచ్చేసరికి నా పిల్లల పరిస్థితి చూసి బాధేసింది. ‘సింపతీ స్టార్’ అంటూ రాబందుల కన్నా దారుణంగా నన్ను పొడుచుకు తిన్నారు” అంటూ ఆమె కంటతడి పెట్టారు. బయటికి ధైర్యంగా కనిపించినంత మాత్రాన మనసులో బాధ ఉండదని అనుకోవద్దని, తానూ ఒక మనిషినేనని వాపోయారు. ఒక్కసారి తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా, పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. హౌస్‌లో అడుగుపెట్టకపోయినా ఆమె పేరు మాత్రం గట్టిగానే వినిపిస్తోంది.

Advertisement