Advertisement

మహబూబాబాద్‌: భర్త ఫోన్ ఎత్తలేదని భార్య సూసైడ్

మహబూబాబాద్‌ క్రైం: భర్త ఫోన్‌ లిఫ్ట్ చేయలేదన్న మనస్తాపంతో ఓ వివాహిత క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామానికి చెందిన అఖిల(20)కు, మహబూబాబాద్‌కు చెందిన హౌసింగ్ ఫైనాన్స్ మేనేజర్ బాణోత్ హుస్సేన్‌తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది. ఇటీవల పుట్టింటికి వెళ్లిన అఖిల.. పాప ఏడుస్తుండటంతో భర్తతో మాట్లాడించేందుకు ఈ నెల 2న వీడియో కాల్‌ చేసింది. అయితే హుస్సేన్‌ కాల్‌ ఎత్తకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది.

తక్షణమే మహబూబాబాద్‌లోని అత్తగారింటికి చేరుకున్న అఖిల.. తీవ్ర మనస్తాపంతో ఎలుకల మందు పేస్ట్ తిన్నది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Advertisement