Advertisement

జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండించిన ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్

మన పత్రిక, హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా పలు ప్రాంతాల్లో విద్యార్థులు నిర్వహిస్తున్న నిరసనల కవరేజ్ సమయంలో జర్నలిస్టులపై జరిగిన దాడులు, బెదిరింపుల సంఘటనలను Federation of Press Clubs (ఎఫ్‌పీసీ) తీవ్రంగా ఖండించింది. ఈ తరహా ఘటనలు పత్రికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ అధ్యక్షుడు గౌతమ్ లాహిరి, జనరల్ సెక్రటరీ సౌరభ్ దుగ్గల్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపే హక్కు పౌరులకు ఉంటుందని, అయితే వార్తలను కవర్ చేసే జర్నలిస్టులపై నిరసనకారులు లేదా భద్రతా దళాలు దాడులకు దిగడం సరైంది కాదని గౌతమ్ లాహిరి, సౌరభ్ దుగ్గల్ తెలిపారు. ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతున్నాయనే భావన ఉన్న మీడియా సంస్థల రిపోర్టర్లను నిరసనకారులు లక్ష్యంగా చేసుకుంటున్నారని సంస్థ పేర్కొంది. ఫీల్డ్ రిపోర్టర్లు తమ విధులను మాత్రమే నిర్వహిస్తారని, సంస్థల ఎడిటోరియల్ నిర్ణయాలు వారి చేతుల్లో ఉండవని స్పష్టం చేసింది. మీడియా సంస్థలు కూడా పౌరుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించేలా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించింది.

Advertisement

మరోవైపు నిరసనల సమయంలో ఢిల్లీ పోలీసులతో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) మితిమీరిన బలప్రయోగానికి దిగాయని ఎఫ్‌పీసీ విమర్శించింది. షాక్ బాటన్లు, పెల్లెట్ గన్లు, మేకులు ఉన్న లాఠీలను వాడారని, అవుట్‌లుక్ మ్యాగజైన్‌కు చెందిన ఒక విలేకరి పెల్లెట్ గన్ గాయాల పాలయ్యారని ఆరోపించింది. అలాగే నిరసన స్థలంలో ఉన్న ఆర్‌ఏఎఫ్ సిబ్బంది, కొంతమంది ఢిల్లీ పోలీసుల వద్ద పేర్ల బిల్లేలు లేకపోవడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని తెలిపింది. జులై 20న జరిగిన ఈ హింసాత్మక ఘటనలపై ఉన్నత న్యాయస్థానం స్వచ్ఛందంగా స్పందించి, నిష్పాక్షిక న్యాయ విచారణకు ఆదేశించాలని కోరింది.

Advertisement