Advertisement

భూపాలపల్లిలో గుట్కా నిల్వలపై సీసీఎస్ దాడి, భారీగా సరుకు స్వాధీనం

మన పత్రిక, భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై సీసీఎస్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి, రూ.1,96,430 విలువైన గుట్కా సహా ఇతర ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక నిఘాలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. భూపాలపల్లిలోని చాముండా జనరల్ స్టోర్స్, దుర్గా జనరల్ స్టోర్స్, పవన్ కృష్ణ కిరాణం దుకాణాల్లో అంబర్, ఆర్‌ఆర్, అనార్, జేకే, మీరాజ్ వంటి నిషేధిత ఉత్పత్తులను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ తనిఖీల సందర్భంగా చాముండా జనరల్ స్టోర్ నిర్వాహకుడు ఛత్రారం సతీష్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీజ్ చేసిన సరుకుతో పాటు నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే నిషేధిత పొగాకు ఉత్పత్తులను రవాణా చేసినా, నిల్వ ఉంచినా లేదా విక్రయించినా కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హెచ్చరించారు. ఇటువంటి అక్రమ వ్యాపారాల గురించి తెలిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement