Advertisement

చర్లపల్లి నుంచి షాలిమార్ మధ్య 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

మన పత్రిక: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని South Central Railway చర్లపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా షాలిమార్ వరకు 16 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7 నుంచి సెప్టెంబర్ 26 వరకు ఈ వీక్లీ స్పెషల్ రైళ్లు అందుబాటులో ఉంటాయని, వీటి ముందస్తు రిజర్వేషన్లు కూడా ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.

రైల్వే శాఖ వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం చర్లపల్లి నుంచి షాలిమార్ వెళ్లే ట్రైన్ నంబర్ 08046 ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 26 వరకు ప్రతి శనివారం మొత్తం 8 సర్వీసులు నడుస్తుంది. అలాగే షాలిమార్ నుంచి చర్లపల్లి వచ్చే ట్రైన్ నంబర్ 08045 ఆగస్టు 7 నుంచి సెప్టెంబర్ 25 వరకు ప్రతి శుక్రవారం మొత్తం 8 సర్వీసులు అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లు విజయవాడ జంక్షన్‌కు వెళ్లకుండా రాయనపాడు మీదుగా ఏలూరు వైపు వెళ్తాయి. కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపుర్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్పూర్, సంత్రగచ్చి స్టేషన్లలో ఇవి ఆగుతాయి.

Advertisement

మరోవైపు ఆషాడ ఏకాదశి పండుగ సందర్భంగా నాందేడ్, నాగర్ సోల్ నుంచి పండరీపూర్ వరకు 6 ప్రత్యేక రైళ్లను కేటాయించారు. నాందేడ్ – పండరీపూర్ ట్రైన్ నంబర్ 07645 సర్వీస్ జులై 26, ఆగస్టు 2 తేదీల్లో నడుస్తుండగా, పండరీపూర్ – నాందేడ్ ట్రైన్ నంబర్ 07646 సర్వీస్ జులై 27, ఆగస్టు 3 తేదీల్లో అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

Advertisement