Advertisement

భూ కబ్జా కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు

మన పత్రిక, ఆమదాలవలస: మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాంపై సుమారు రూ. 4 కోట్ల విలువైన భూ కబ్జా కేసు నమోదైంది. ఈ కేసులో తమ్మినేని సీతారాం తో పాటు ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్‌లను నిందితులుగా పోలీసులు చేర్చారు. అరెస్టు తప్పదని భావించిన తమ్మినేని కుటుంబం, తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆమదాలవలసలోని తమ అద్దె ఇంటి నుంచి రహస్యంగా వెళ్ళిపోయినట్లు సమాచారం. పోలీసుల ట్రాకింగ్ నుంచి తప్పించుకునేందుకు వారు తమ ఫోన్లను కూడా ఇంట్లోనే వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది.

భూ కబ్జా ఆరోపణలు

చాపురం పంచాయతీ పరిధిలో ఉన్న భూ యజమాని బతికుండగానే, ఆయన చనిపోయినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలను సృష్టించారనేది ప్రధాన అభియోగం. ఆ తర్వాత ఒడిశాకు చెందిన ఒక మహిళను ఆ భూమికి వారసురాలిగా చూపి, ఆ స్థలాన్ని తమ్మినేని సీతారాం కుమారుడి పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు విచారణలో గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే హిరమండలం సబ్‌రిజిస్ట్రార్ సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం మాజీ హోంగార్డు త్రినాథ్, తెలుగు సతీష్ కుమార్, రజని తదితరులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేసినట్లు తేలింది. తమ్మినేని కుటుంబం కోసం పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేశారు.

Advertisement
Advertisement