Advertisement

దుబాయ్‌లో ఘనంగా జరిగిన ఈటీసీఏ బోనాల జాతర

మన పత్రిక, దుబాయ్: తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాన్ని ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో యూఏఈలో ఎంతో వైభవంగా నిర్వహించారు. జూలై 19న రాస్ అల్ ఖైమాలోని మైత్రి ఫార్మ్స్ వేదికగా జరిగిన ఈ వేడుకకు మైత్రి గ్రూప్ వ్యవస్థాపకులు కొత్త జైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కొత్త జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, విదేశాల్లో ఉంటున్నా ప్రవాస తెలంగాణవాసులు తమ సంస్కృతిని, మూలాలను మర్చిపోకుండా బోనాలు, బతుకమ్మ వంటి పండుగలను ఇంత ఘనంగా జరుపుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎడారి నేలపై తెలంగాణ ఆత్మను, పల్లె వాతావరణాన్ని సజీవంగా నిలిపిన తీరును ఆయన ప్రశంసించారు. ఈ వేడుకల్లో దుబాయ్, అబుదాబి, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ ఖువైన్, రాస్ అల్ ఖైమా, ఫుజైరా నుంచి సుమారు 400 మందికి పైగా ప్రవాసులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. వరుసగా నాలుగో ఏడాది జరిగిన ఈ కార్యక్రమంలో గౌరమ్మ పూజ, బోనాల సమర్పణ, కుంకుమార్చన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు, ఒగ్గు డోలు మోతలు, పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Advertisement
Advertisement