Advertisement

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డుల డిజిటలైజేషన్: ఈ-ఎస్ఆర్ 2.0 అమలుకు ఉత్తర్వులు

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డుల నిర్వహణలో కీలక మార్పులు చేస్తూ, ఈ-ఎస్ఆర్ 2.0 (E-SR 2.0) విధానాన్ని ప్రవేశపెట్టింది. దశాబ్దాలుగా పేపర్ల రూపంలో ఉన్న సర్వీస్ రిజిస్టర్ల వల్ల ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని సేవా అంశాలను ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారానే పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

డిజిటల్ విధానం అమలు

గతంలో 2018లో తీసుకున్న నిర్ణయం, 2020లో ప్రారంభించిన వ్యవస్థ వివిధ కారణాల వల్ల పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఇప్పుడు కొత్తగా రూపొందించిన ఈ-ఎస్ఆర్ 2.0 వ్యవస్థను e-HRM, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్, పేరోల్ వ్యవస్థలతో అనుసంధానించారు. దీనివల్ల వార్షిక ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, సెలవులు, బదిలీలు, పెన్షన్ వంటి ప్రక్రియలు వేగవంతం కావడమే కాకుండా మానవ తప్పిదాలు తగ్గుతాయని ప్రభుత్వం పేర్కొంది.

Advertisement

నిర్దేశించిన గడువులోపు పూర్తి

తొలి దశలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. సెప్టెంబర్ 1 నుండి అన్ని కొత్త సర్వీస్ ఈవెంట్లను తప్పనిసరిగా ఈ-ఎస్ఆర్ 2.0లోనే నమోదు చేయాలని ఆదేశించారు. మిగిలిన ప్రభుత్వ కార్యాలయాల్లో ఆగస్టు 1 నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఉద్యోగులు తమ ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. ఈ వివరాలను చెకర్ ధృవీకరించి, హెచ్ఆర్ మేనేజర్ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అన్ని శాఖలు, జిల్లా కలెక్టర్లు, డిడిఓలను ప్రభుత్వం ఆదేశించింది.

Advertisement