మన పత్రిక: జూన్ 21న జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని, త్వరలో అడ్మిట్ కార్డులు జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో దేశంలోని 551, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరగనుంది. గతంలో పేపర్ లీక్ నేపథ్యంలో ఈసారి పారదర్శకత కోసం కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. దాదాపు 23 లక్షల మంది హాజరయ్యే ఈ పరీక్షకు 5 లక్షల మందికి పైగా సిబ్బందిని, సమస్యాత్మక ప్రాంతాల్లో పారామిలట్రీ బలగాలను రంగంలోకి దించుతున్నారు.
పర్యవేక్షణ కోసం లక్షకు పైగా సీసీటీవీ కెమెరాలు, ఏఐ ఆధారిత నిఘాను ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాల రవాణా కోసం వాయుసేన సేవలను వినియోగిస్తుండటం గమనార్హం. నకిలీ అభ్యర్థులను అడ్డుకునేందుకు ప్రవేశ ద్వారం వద్ద ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఆధార్ వెరిఫికేషన్ చేయనున్నారు.
