Advertisement

కోహెడలో రూ.2,300 కోట్లతో పండ్ల మార్కెట్‌కు సీఎం శంకుస్థాపన

మన పత్రిక, కోహెడ: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో రూ.2,300 కోట్లతో నిర్మించనున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 240 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ మార్కెట్‌ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు అన్ని రకాల పండ్లు ఒకే చోట అందుబాటులో ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.

పండ్ల మార్కెట్‌తో పాటు అదే ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో నిర్మించనున్న సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల భవన సముదాయానికి కూడా సీఎం భూమిపూజ చేశారు. వచ్చే డిసెంబర్ నాటికి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణానికి గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. అలాగే, హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఉన్న 39 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 ప్రత్యేక క్లస్టర్లుగా విభజించి కార్పొరేట్ స్థాయిలో నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement