మన పత్రిక హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మాంసం ప్రియులకు షాక్ ఇచ్చేలా చికెన్ షాపుల యజమానుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పౌల్ట్రీ కంపెనీల మొండివైఖరికి నిరసనగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణవ్యాప్తంగా చికెన్ విక్రయాలు నిలిపివేయాలని (బంద్) నిశ్చయించింది. మార్కెట్లో ధరలు పెరుగుతున్నా, తమకు ఇచ్చే మార్జిన్ను పౌల్ట్రీ కంపెనీలు భారీగా తగ్గించడంపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే కిలోకు రూ.20 వరకు మార్జిన్ తగ్గించారని, ఈ పరిస్థితుల్లో వ్యాపారం చేయడం భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు.
రికార్డు స్థాయిలో ధరలు ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ ధర రూ.360 నుంచి రూ.380 వరకు పలుకుతోంది. వారం రోజుల వ్యవధిలోనే ధరలు అమాంతం పెరగడం గమనార్హం. ఎండల తీవ్రతకు బ్రాయిలర్ కోళ్లు మృత్యువాత పడటం, దాణా ఖర్చులు పెరగడం వల్ల సరఫరా గణనీయంగా తగ్గింది. కోళ్లను కాపాడుకోవడానికి కూలర్లు, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయడం ఫామ్ నిర్వాహకులకు అదనపు భారం కావడంతో చాలామంది పెంపకాన్ని నిలిపివేశారు. దీనివల్ల ఏపీ, మహారాష్ట్రల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని, త్వరలోనే కిలో ధర రూ.400 దాటే అవకాశం ఉందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని పౌల్ట్రీ కంపెనీలతో మాట్లాడి తమ మార్జిన్ పెంచకపోతే నిరవధిక సమ్మెకు వెళ్తామని అసోసియేషన్ స్పష్టం చేసింది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
