Advertisement

త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్‌కర్ అనుమానాస్పద మృతి

మన పత్రిక: త్రిపుర పోలీస్ యంత్రాంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) మరియు సీనియర్ ఐపీఎస్ అధికారి అనురాగ్ ధన్‌కర్ అగర్తలాలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలోని తన సొంత ఛాంబర్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సోమవారం ఉదయం తన కార్యాలయానికి వచ్చిన ఆయన, గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆయన ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించడంతో తోటి సిబ్బంది షాక్‌కు గురయ్యారు.

వెంటనే స్పందించిన సిబ్బంది, ఆయనను అగర్తలాలోని గోవింద్ వల్లభ్ పంత్ (GBP) ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా వెంటనే పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రదేశాన్ని పోలీసులు సీల్ చేసి దర్యాప్తు చేపట్టారు. మరణానికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక తర్వాతే స్పష్టమవుతాయని, పుకార్లను నమ్మవద్దని అధికారులు సూచించారు.

Advertisement
Advertisement