Advertisement

తిరుమల ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసును 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

మన పత్రిక, తిరుపతి: తిరుమల ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద జరిగిన ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించిన తిరుపతి జిల్లా పోలీసులను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అభినందించారు. వేగవంతమైన దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు, స్వామివారి విగ్రహాన్ని సురక్షితంగా స్వాధీనం చేసుకోవడం పోలీసుల సమర్థతకు నిదర్శనమని ఆయన కొనియాడారు.

తిరుమల వంటి పవిత్రమైన క్షేత్రాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లను తక్షణమే పటిష్ఠం చేయాలని ఆయన సూచించారు. ఆలయ ప్రాంగణాల్లో సీసీటీవీ నిఘాను నిరంతరం పర్యవేక్షించాలని, గస్తీని పెంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భద్రతను అమలు చేయాలని చెప్పారు. దేవతా విగ్రహాలను అపహరించడం లేదా ఆలయ ఆస్తులతో ఆడుకునే వారిపై కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి హెచ్చరించారు.

Advertisement
Advertisement