మన పత్రిక, AP: రైల్వే కోడూరులో జరిగిన దాడి ఘటనపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేశారు. పథకం ప్రకారమే తమపై దాడి జరిగిందని, తనను చంపేందుకు ప్రయత్నించారని తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆమె, “నేను చావడానికైనా సిద్ధమే కానీ నా పోరాటం ఆపను” అని స్పష్టం చేశారు. దాడి సమయంలో అరవ శ్రీధర్ అక్కడే ఉన్నారని, తనపై దాడికి ఆయనే ప్రేరేపించారని ఆరోపించారు. తాతంశెట్టి నాగేంద్ర తనపై దాడి చేశారని, మరికొందరు కలిసి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల విచారణకు తాను సహకరిస్తున్నానని తెలిపారు.
గురువారం సాయంత్రం రైల్వే కోడూరులో గాంధీ విగ్రహం సమీపంలో బాధితురాలు తన అనుచరుడితో ఉండగా, అరవ శ్రీధర్, నాగేంద్ర వాహనాలు అక్కడికి వచ్చినట్లు సమాచారం. శ్రీధర్ ఉన్నాడని భావించి కారులో చూడటానికి ప్రయత్నించిన సమయంలో నాగేంద్ర అనుచరులు దాడికి పాల్పడ్డారు. కులం పేరుతో దూషిస్తూ ఇనుప రాడ్లతో కొట్టి గాయపరిచారు. తీవ్రగాయాలైనప్పటికీ బాధితురాలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
