తెలంగాణ అసెంబ్లీ రేపటికి ఉదయం 9 గంటలకు వాయిదా పడింది. ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జరగనుంది. కొద్దిసేపట్లో BAC సమావేశం జరగనుంది. ఎన్ని రోజుల పాటు సమావేశాలు, ఏ అంశాలపై చర్చించాలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా.
2014లో టీడీపీ నుంచి, తర్వాత బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు గెలిచారు గోపీనాథ్. ఆయన అనారోగ్యాన్ని ఎవరికీ చెప్పుకోలేదు. గోపీనాథ్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. సభలో ఆయన సంతాప తీర్మానం ప్రవేశపెడతామని కలలో కూడా ఊహించలేదని కేటీఆర్ భావోద్వేగంగా పేర్కొన్నారు. గోపీనాథ్ లేకపోవడం పార్టీకి తీరని లోటని అన్నారు.
కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఆది శ్రీనివాస్ యూరియా కొరతను కేంద్ర వైఫల్యంగా పేర్కొన్నారు. గండ్ర సత్యనారాయణ బీజేపీ నేతలే యూరియా సమస్యకు కారణమని ఆరోపించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు యూరియా ఇచ్చే ప్రయత్నం విడ్డూరమని విమర్శించారు. మధుసూదన్ రెడ్డి బీఆర్ఎస్ కాళేశ్వరం నివేదికపై చర్చ రాకుండా యూరియా అంశాన్ని ప్రస్తావిస్తోందని ఆరోపించారు. రైతులకు యూరియా కొరత రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి సభలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. 1963లో జన్మించిన గోపీనాథ్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. తెలుగు యువత అధ్యక్షుడిగా ఏడేళ్లు సేవలందించారు. సినీ నిర్మాతగా కూడా ప్రతిభ చూపారు. ఆయన తనకు మంచి మిత్రుడని, రాజకీయ మార్పులు ఉన్నా వారి మధ్య మైత్రి అలుగనిదని సీఎం పేర్కొన్నారు.
గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ అమరులకు నివాళులర్పించారు. ఖాళీ యూరియా బస్తాలతో ప్రభుత్వంపై నిరసన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాలపై సమాధానం ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతులకు యూరియా సరఫరా చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు.
నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కేంద్రంగా తీవ్ర రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకొని బీఆర్ఎస్ పై కాంగ్రెస్ వాగ్బాణాలు సంధించనుంది. నివేదికను చర్చించి ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంతో పాటు, సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ బీజేపీ ప్రతిపాదించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ మాత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు చాన్స్ ఇవ్వాలంటూ పట్టుబడుతోంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరగనుంది.
శాసనసభ వాయిదా తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గం సమావేశం కానుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జీవోకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్రాన్ని కోరుతూ పంటలు, రహదారులు సహా ఇతర నష్టాలపై అంచనాలతో తీర్మానం ఆమోదించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
