మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. లబ్ధిదారుల డేటాను నిరంతరం ట్రాక్ చేసేలా, అత్యంత అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో పనిచేసే ‘మల్టీ-పర్పస్ యూనిఫైడ్ కార్డ్’ను తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఈ వినూత్న ప్రాజెక్టు ద్వారా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF), ఫీజు రీఇంబర్స్మెంట్, కార్మిక, విద్యా శాఖల సంక్షేమ ప్రయోజనాలన్నీ ఈ ఒకే కార్డు ద్వారా లభిస్తాయి. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, కుల సర్వే (SEEEPC) డేటాను సైతం ఈ యూనిఫైడ్ కార్డ్ ప్రొఫైల్తో అనుసంధానం చేయనున్నారు. మరణ ధృవీకరణ పత్రం జారీ అయిన వెంటనే ఆ సమాచారం ఆటోమేటిక్గా పెన్షన్ డేటాబేస్కు అనుసంధానమయ్యేలా ఏఐ ప్రొఫైలింగ్ పనిచేస్తుంది. దీనివల్ల నకిలీలను అరికట్టడంతో పాటు, ఒకే లబ్ధిదారుడికి ఒకే పథకం రెండుసార్లు అందకుండా (డూప్లికేషన్) నివారించవచ్చు. కేరళ తరహాలో గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారి పాస్పోర్ట్, వీసాల సమాచారాన్ని కూడా ఇందులో కేంద్రీకృతం చేయనున్నారు.
ఈ యూనిఫైడ్ కార్డుల జారీ ప్రక్రియను విడివిడి శాఖల ద్వారా కాకుండా నేరుగా రాష్ట్ర ఐటీ శాఖ ద్వారానే చేపట్టాలని ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు, సీఎస్ కె. రామకృష్ణారావులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువ అధికారుల సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి :
- బీఎస్ఎన్ఎల్లో 100 జేటీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- హైదరాబాద్లో పడిపోయిన రియల్ ఎస్టేట్: కొనుగోలుదారులు లేక ఖాళీగా ఫ్లాట్లు
- Petrol Diesel price hike : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: దిల్లీలో రూ. 100 దాటిన రేటు
- నేటితో ముగియనున్న టీజీ దోస్త్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువు
- తెలంగాణలో తొలి గాజు వంతెన.. హుస్నాబాద్లో ముమ్మరంగా పనులు
