మధ్యప్రదేశ్కు చెందిన ఒక రేప్ కేసు విచారణలో సుప్రీంకోర్టు అరుదైన, ఆసక్తికర తీర్పునిచ్చింది. పరస్పర అపార్థాల వల్ల విడిపోయి, ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్ష వరకు వెళ్లిన ఓ జంటను తన ‘అసాధారణ అధికారాలను’ (Article 142) ఉపయోగించి తిరిగి కలిపింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం తమ ‘సిక్స్త్ సెన్స్’ (Sixth Sense) ద్వారా వీరు కలుస్తారని ముందే గ్రహించామని వ్యాఖ్యానించింది.
అసలేం జరిగిందంటే: 2015లో సోషల్ మీడియాలో పరిచయమైన ఈ జంట, 2021లో పెళ్లి విషయంలో విభేదాలు రావడంతో విడిపోయారు. యువతి రేప్ కేసు పెట్టడంతో కింది కోర్టు యువకుడికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో అతను ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయాడు. అయితే సుప్రీం విచారణలో ఉండగా వారిద్దరూ రాజీపడి, జూలై 2024లో పెళ్లి చేసుకున్నారు. దీంతో కోర్టు శిక్షను రద్దు చేసి, అతని ఉద్యోగాన్ని, పెండింగ్ జీతాలను ఇవ్వాలని ఆదేశించింది.
కానీ.. మిగిలిన ప్రశ్నలు: తీర్పు ఆహ్వానించదగ్గదే అయినా.. సహజీవనం చేసి, తేడా రాగానే ‘రేప్’ కేసులు పెట్టడం చట్టాన్ని దుర్వినియోగం చేయడం కాదా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగిన నిందితుడి మానసిక వేదనకు, పోగొట్టుకున్న పరువుకు బాధ్యులెవరు? తప్పుడు కేసులను అడ్డుకునే వ్యవస్థ ఉండాలనే వాదన బలంగా వినిపిస్తోంది.
